20
1 అప్పుడు ఒక దేవదూత పరలోకంనుంచి దిగిరావడం నాకు కనిపించింది. అతని చేతిలో అగాధానికి తాళంచెవి, పెద్ద గొలుసు ఉన్నాయి. 2 అతడు రెక్కలున్న సర్పాన్ని – అపనింద పిశాచమూ సైతానూ అయి ఉన్న ఆ ఆది సర్పాన్ని పట్టుకొని వెయ్యేళ్ళకు బంధించి 3 వాణ్ణి అగాధంలో పడవేశాడు. ఆ వెయ్యేళ్ళు గడిచేంతవరకూ వాడు ఇక జనాలను మోసగించకుండా ఆ దేవదూత అగాధం మూసివేసి వాడిపైగా ముద్ర వేశాడు. ఆ తరువాత వాణ్ణి కొద్ది కాలానికి విడుదల చేయడం జరిగితీరాలి.
4 అప్పుడు సింహాసనాలనూ వాటిమీద కూర్చుని ఉన్నవారినీ చూశాను. తీర్పు తీర్చడానికి అధికారం వారికివ్వబడింది. యేసును గురించిన సాక్ష్యం చెప్పినందుకూ దేవుని వాక్కును బట్టీ శిరచ్ఛేదం పాలైనవారి ఆత్మలను కూడా చూశాను. వారు ఆ మృగాన్నయినా వాడి విగ్రహాన్నయినా పూజ చేయకుండా వాడి ముద్ర తమ నొసట గానీ చేతిమీద గానీ పడనివ్వకుండా ఉన్నవారు. వారు బ్రతికి క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరాలు రాజ్యపరిపాలన చేసారు. 5 చనిపోయిన వారిలో తక్కినవారు ఆ వెయ్యి సంవత్సరాలు గడిచేంతవరకూ మళ్ళీ బ్రతకలేదు. ఇది మొదటి పునర్జీవితం. 6 ఈ మొదటి పునర్జీవితంలో పాల్గొన్నవారు ధన్యులూ పవిత్రులూ. అలాంటివారిమీద రెండో చావుకు అధికారం ఉండదు. వారు దేవునికీ క్రీస్తుకూ యాజులై ఆయనతోకూడా వెయ్యి సంవత్సరాలు రాజ్యపరిపాలన చేస్తారు.
7 ఆ వెయ్యి సంవత్సరాలు గడిచిన తరువాత సైతానుకు తన ఖైదులోనుంచి విడుదల కలుగుతుంది. 8 భూమి నలుదిక్కులా ఉన్న జనాలను – గోగు, మాగోగులను – మోసపుచ్చి యుద్ధానికి పోగు చేయడానికి వాడు బయలుదేరిపోతాడు. లెక్కకు వారు సముద్రం ఇసుక రేణువులలాంటివారు. 9 వారు భూమి విశాలంమీద సాగిపోయి పవిత్రుల శిబిరమైన ఆ ప్రియ నగరం చుట్టుముట్టారు. అప్పుడు దేవుని దగ్గర నుంచి పరలోకంలోనుంచి మంటలు దిగివచ్చి వారిని మ్రింగివేస్తాయి. 10 వారిని మోసపుచ్చిన అపనింద పిశాచాన్ని మృగమూ కపట ప్రవక్తా ఉన్న అగ్నిగంధకాల సరస్సులో పడవేయడం జరిగింది. వారు యుగయుగాలకు రాత్రింబగళ్లు వేదనపాలై ఉంటారు.
11 అప్పుడు తెల్లని మహా సింహాసనాన్నీ దానిమీద కూర్చుని ఉన్న వ్యక్తినీ చూశాను. ఆయన సముఖంనుంచి భూమి, ఆకాశం పారిపోయాయి. వాటికి నిలువ చోటు ఎక్కడా దొరకలేదు. 12 అప్పుడు దేవుని ముందర చనిపోయినవారు – ఘనులైనా అల్పులైనా నిలుచుండడం చూశాను. అప్పుడు గ్రంథాలు విప్పబడ్డాయి. మరో గ్రంథం కూడా విప్పబడింది – అదే జీవ గ్రంథం. ఆ గ్రంథాలలో రాసి ఉన్న విషయాల ప్రకారం, వారి పనులనుబట్టి, చనిపోయినవారు తీర్పుకు గురి అయ్యారు. 13 సముద్రం తనలో ఉన్న చనిపోయినవారిని అప్పగించింది. మృత్యువు, పాతాళం తమలో ఉన్న చనిపోయినవారిని అప్పగించాయి. ప్రతి ఒక్కరూ తమ పనుల ప్రకారమే తీర్పుకు గురి అయ్యారు. 14 అప్పుడు మృత్యువూ పాతాళమూ అగ్ని సరస్సులో పడవేయబడ్డాయి. ఇది రెండో చావు. 15 ఏ వ్యక్తి పేరు జీవ గ్రంథంలో రాసి ఉన్నట్టు కనబడలేదో ఆ వ్యక్తి అగ్ని సరస్సులో పడవేయడం జరిగింది.