14
1  నేనింకా చూస్తూ ఉంటే సీయోను పర్వతం మీద గొర్రెపిల్ల నిలుచుండడం కనిపించింది. ఆయనతో పాటు లక్ష నలభై నాలుగు వేలమంది ఉన్నారు. వారి నొసళ్ళమీద ఆయన తండ్రి పేరు రాసి ఉంది. 2 అప్పుడు పరలోకంనుంచి ఒక శబ్దం నాకు వినిపించింది. అది అనేక జలాల ధ్వనిలాంటిది, గొప్ప ఉరుము ధ్వనిలాంటిది. నేను తంతివాద్యాలు వాయిస్తున్నవారి తంతి వాదనం విన్నాను. 3 వారు సింహాసనం ముందర, ఆ నాలుగు ప్రాణుల ముందర, ఆ పెద్దల ముందర కొత్త పాట ఒకటి పాడారు. ఈ లక్ష నలభై నాలుగు వేలమంది తప్ప మరెవ్వరూ ఆ పాట నేర్చుకోలేకపోయారు. వీరు భూలోకంలోనుంచి విమోచించ బడ్డవారు. 4 వీరు పెళ్ళి కానివారై స్త్రీలతో తమను తాము అపవిత్రం చేసుకోనివారు. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళినా సరే వీరు ఆయన వెంటవెళ్తూ ఉన్నారు. వీరు మనుషులలో నుంచి విమోచించబడి దేవునికీ గొర్రెపిల్లకూ తొలి పంటగా ఉన్నారు. 5 వీరి నోట ఏ మోసమూ కనబడలేదు. దేవుని సింహాసనం ముందర వీరిలో నిందించతగిన విషయమేమీ లేదు.
6 అప్పుడు మరో దేవదూత ఆకాశం మధ్యన ఎగిరిపోతూ ఉండడం నాకు కనిపించింది. అతడు భూమిమీద నివసించేవారికి – ప్రతి దేశంవారికీ ప్రతి జాతికీ ప్రతి భాష మాట్లాడేవారికీ ప్రతి జనానికీ ప్రకటించడానికి శాశ్వత శుభవార్త గలవాడు. 7 అతడు పెద్ద స్వరంతో చెప్పినదేమిటంటే, “దేవునికి భయపడండి! ఆయనకు మహిమ చేకూర్చండి! ఆయన తీర్పు ఘడియ వచ్చింది! ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ నీళ్ళ ఊటలనూ కలగజేసిన ఆయనను ఆరాధించండి!”
8 అతని వెంట మరో దేవదూత వచ్చి ఇలా చెప్పాడు:
“మహా నగరమైన బబులోను కూలిపోయింది! కూలిపోయింది! అది తన వ్యభిచార ఆగ్రహ ద్రాక్షమద్యం జనాలన్నిటికీ తాగించింది!”
9 వారి వెంట మూడో దేవదూత వచ్చి పెద్ద స్వరంతో ఇలా చెప్పాడు:
“ఎవరైనా సరే ఆ మృగాన్నీ వాడి విగ్రహాన్నీ పూజిస్తే, నొసటిమీద గానీ చేతిమీద గానీ వాడి ముద్ర పడనిస్తే 10 ఆ వ్యక్తి దేవుని ఆగ్రహ ద్రాక్షమద్యం త్రాగుతాడు. దానిని దేవుడు తన ఉగ్రత పాత్రలో కల్తీ లేకుండా పోశాడు. అంతే కాక, ఆ వ్యక్తిని పవిత్ర దేవదూతల ముందర, గొర్రెపిల్ల ముందర అగ్నిగంధకాలతో వేధించడం జరుగుతుంది. 11 వారి వేదన సంబంధమైన పొగ యుగయుగాలకు పైకి లేస్తూ ఉంటుంది. మృగాన్నీ వాడి విగ్రహాన్నీ పూజించేవారికీ వాడి పేరు ముద్ర పడనిచ్చినవారికీ రాత్రింబగళ్లు ఏమీ విశ్రాంతి లేదు.”
12 ఇలాంటప్పుడు పవిత్రుల సహనం ఉంది; ఇలాంటప్పుడు దేవుని ఆజ్ఞలూ యేసు విశ్వాస సత్యాలూ పాటించే వారు ఉన్నారు.
13 అప్పుడు పరలోకంనుంచి ఒక స్వరం నాకు వినిపించి “ఈ విధంగా రాయి: ఇప్పటినుంచి ప్రభువులో ఉంటూ చనిపోయేవారు ధన్యులు” అంది. “అవును, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి అనుభవిస్తారు. వారి క్రియలు వారి వెంట వస్తాయి” అని దేవుని ఆత్మ చెపుతున్నాడు.
14 నేను చూస్తూ ఉంటే, తెల్లని మేఘం, ఆ మేఘం మీద మానవ పుత్రుడిలాంటి వ్యక్తి ఒకరు కూర్చుని ఉండడం నాకు కనిపించింది. ఆయన తలమీద బంగారు కిరీటం ఉంది, ఆయన చేతిలో వాడిగల కొడవలి ఉంది. 15 మరో దేవదూత దేవాలయంలోనుంచి వచ్చి మేఘంమీద కూర్చుని ఉన్న వ్యక్తితో బిగ్గరగా ఇలా అన్నాడు:
“భూమి పంట పండింది, నీవు కోత కోసే కాలం వచ్చింది, గనుక నీ కొడవలి పెట్టి కోసుకో.”
16 మేఘంమీద కూర్చుని ఉన్న వ్యక్తి భూమిమీద తన కొడవలి పెట్టాడు. వెంటనే భూమి పంట కోయబడింది.
17 అప్పుడు పరలోకంలో ఉన్న దేవాలయంలోనుంచి మరో దేవదూత వచ్చాడు. ఇతనిదగ్గర కూడా వాడిగల కొడవలి ఉంది. 18 మరో దేవదూత వేదిక దగ్గరనుంచి వచ్చాడు. ఇతడు నిప్పుమీద అధికారం ఉన్నవాడు. ఇతడు వాడిగల కొడవలి గలవానితో పెద్ద స్వరంతో ఇలా అన్నాడు:
“భూమి ద్రాక్షపండ్లు పండాయి, గనుక వాడిగల నీ కొడవలి పెట్టి ద్రాక్షచెట్టునుంచి దాని గెలలు కోయండి.”
19 ఆ దేవదూత తన కొడవలి భూమిమీద పెట్టి దాని ద్రాక్ష చెట్టు కోసి దేవుని ఉగ్రత మహా ద్రాక్ష గానుగతొట్టిలో పడవేశాడు. 20 ఆ ద్రాక్ష గానుగ నగరం బయట తొక్కడం జరిగింది. గానుగలోనుంచి రక్తం వచ్చి సుమారు మూడు వందల ఇరవై కిలోమీటర్ల దూరం, గుర్రం కళ్ళెమంత ఎత్తు పారింది.