కొలస్సయివారికి లేఖ
పరిచయం
రచయిత:
ప్రభువైన యేసు క్రీస్తు రాయబారి అయిన పౌలు.
వ్రాసిన కాలం:
క్రీ.శ. దాదాపు 60లో.
ముఖ్యాంశాలు:
క్రీస్తు రాయబారి పౌలు ఈ లేఖ రాసినప్పుడు క్రీస్తు శుభవార్త ప్రకటించినందుచేత ఖైదులో ఉన్నాడు. పౌలు కొలస్సయి పట్టణానికి ఎప్పుడూ వెళ్ళలేదు గాని, అక్కడి సంఘం పరిస్థితులను గురించి విని ఈ దివ్య లేఖ రాశాడు. ఇందులో ముఖ్యాంశం యేసు క్రీస్తు ఆధిక్యత, ఆయనలో ఉన్న సంపూర్ణత. కొందరు దుర్బోధకులు కొలస్సయికి వెళ్ళి తాము గొప్ప జ్ఞానులైనట్టు ప్రవర్తిస్తూ వ్యర్థమైన తత్వశాస్త్రం, వేదాంతం ఉపదేశిస్తూ, క్రీస్తు శుభవార్తను తారుమారు చేయడానికి ప్రయత్నించారు. వారి ఉపదేశంలోని కొన్ని తప్పు సిద్ధాంతాలేవంటే, విముక్తికోసం వారు నేర్పిన ‘జ్ఞానం’ అవసరం, క్రీస్తు దేవుడు కాడు, లోక రక్షకుడూ కాడు, దేవునికీ మనుషులకూ మధ్యవర్తులుగా అనేక దేవదూతలూ ఆత్మరూపులూ ఉన్నారు, వారిలో క్రీస్తు ఒకడు మాత్రమే అన్నారు. దేవదూతలను ఆరాధించడమూ కఠినమైన తపస్సు చేయడమూ మేలురకం అన్నారు. ఇలాంటి తప్పు సిద్ధాంతాలను పౌలు ఖండిస్తూ, క్రీస్తు విమోచన గురించీ (1:13-14, 20), దేవత్వాన్ని గురించీ (1:15-19) నొక్కి చెప్పాడు. విశ్వాసులకు క్రీస్తులో సంపూర్ణ జ్ఞానం ఉందన్నాడు. ఈ లేఖకు మూల వాక్కులు 2:8-10 అనవచ్చు.
విషయసూచిక
కొలస్సయి విశ్వాసులకోసం ప్రార్థన, కృతజ్ఞతలు 1:3-9
తన ప్రార్థనకు కారణం 1:10-12
క్రీస్తులో విశ్వాసుల స్థానం 1:13-14
క్రీస్తు ఆధిక్యత 1:15-20
విశ్వాసుల పూర్వం, ప్రస్తుతం ఉన్న స్థితి 1:21-23
క్రీస్తు సంఘంకోసం పౌలు అనుభవించిన కష్టాలు 1:24-29
తాను పడిన కష్టాలకు, చేసిన ప్రార్థనలకు కారణం 2:1-5
క్రీస్తులో స్వేచ్ఛ, సంపూర్ణత దొరకడం 2:6-23
నమ్మకంతో జీవించడం 2:6-7
తప్పుడు బోధకులను, తత్వశాస్త్రాలనూ కాదనడం 2:8
క్రీస్తే దేవుని సంపూర్ణత 2:9
క్రీస్తులోనే విశ్వాసుల సంపూర్ణత 2:10
క్రీస్తులో వారు దేవునికోసం ప్రత్యేకించబడ్డారు 2:11-12
వారికి ధర్మశాస్త్రంనుంచి విడుదల, క్షమాపణ, జీవం ఉన్నాయి 2:13-17
అసత్య ఆరాధన 2:18-23
విశ్వాసుల జీవం పరలోకంలో ఉంది 3:1-4
చెడు కోరికలను, చేష్టలను చంపివేయాలి 3:5-6
విశ్వాసులు పూర్వం బ్రతికిన తీరు, ఇప్పుడు బ్రతకవలసిన తీరు 3:7-17
వారి వారి కుటుంబాలలో క్రైస్తవుల జీవితం 3:18—4:1
అవిశ్వాసులపట్ల ప్రవర్తించవలసిన తీరు, ప్రార్థన చేయాలని ప్రోత్సాహం 4:2-6
తుకికస్, ఒనేసిము 4:7-9
అనేకమంది విశ్వాసుల అభినందనాలు 4:10-15.