2
1 అయితే ఆ ప్రజలలో కపట ప్రవక్తలు కూడా లేకపోలేదు. అలాగే మీలో కూడా కపట ఉపదేశకులుంటారు. వారు వినాశనకరమైన తప్పు సిద్ధాంతాలను దొడ్డి దారిన ప్రవేశపెట్టి తమను కొన్న ప్రభువును కూడా కాదంటారు. తద్వారా తమ మీదికి శీఘ్ర విధ్వంసం తెచ్చుకొంటారు. 2 అంతేగాక, వారి విధ్వంసక మార్గాలను చాలామంది అనుసరిస్తారు. వీరి కారణంగా సత్య మార్గం దూషణకు గురి అవుతుంది. 3 ఆ కపట ఉపదేశకులు అత్యాశపరులై కల్లబొల్లి మాటలు చెపుతూ మీచేత లాభం సంపాదించుకొంటారు. చాలా కాలం క్రిందట వారి గురించిన తీర్పు వృథా కాలక్షేపం చేయడం లేదు. వారి నాశనం నిద్రపోవడం లేదు.
4 పాపం చేసిన దేవదూతలను దేవుడు అలా విడిచిపెట్టలేదు గాని పాతాళంలోకి పడద్రోసి దట్టమైన చీకటి సంకెళ్ళకు అప్పగించి తీర్పుకోసం ఉంచాడు. 5 అంతేకాక, ఆయన పురాతన లోకాన్ని విడిచిపెట్టకుండా ఆ భక్తిహీనుల లోకంమీదికి జలప్రళయం రప్పించి, నీతిన్యాయాలను ప్రకటించిన నోవహునూ – మొత్తం ఎనిమిది మందిని మాత్రమే కాపాడాడు. 6  అంతేకాక, ఆయన సొదొమ, గొమొర్రా అనే పట్టణాలకు నాశనం విధించి వాటిని భస్మం చేసి, ఆ తరువాత దైవభక్తి లేకుండా బ్రతికేవారికి వాటిని ఉదాహరణగా చేశాడు. 7 గానీ న్యాయవంతుడైన లోత్‌ను తప్పించాడు. లోత్‌ ఆ అక్రమకారుల పోకిరీ జీవిత విధానం కారణంగా ఆయాసపడ్డాడు. 8 వారిమధ్య ఆ న్యాయవంతుడు కాపురముంటూ వారిని చూస్తూ వింటూ నీతిమంతమైన తన మనసులో వారి అక్రమ కార్యాల కారణంగా అతడు రోజుల తరబడి ఎంతో బాధపడ్డాడు.
9 అలాంటప్పుడు దైవభక్తి గలవారిని విషమ పరీక్షలలో నుంచి ఎలా తప్పించాలో, న్యాయం తప్పినవారిని ఎలా దండిస్తూ తీర్పు రోజుకోసం కావలిలో ఉంచాలో ప్రభువుకు తెలుసు. 10 భ్రష్టమైన దాన్ని కోరి శరీర స్వభావాన్ని అనుసరిస్తూ ప్రభుత్వాన్ని తృణీకరిస్తూ ఉండేవారి విషయంలో ఇది మరీ నిజం. వారు మొండి ధైర్యం గలవారు, విర్రవీగే స్వార్థపరులు. మహనీయులను దూషించడానికి వీరు భయపడరు. 11 వీరికంటే దేవదూతలు ఎక్కువ బలప్రభావాలు గలవారైనా ప్రభు సన్నిధానంలో వారిని దూషించరు, నేరం మోపరు.
12  వీరైతే తమకు తెలియని విషయాలను గురించి దూషిస్తారు. పట్టుబడి నాశనం కావడానికే పుట్టిన ప్రకృతి సిద్ధమైన, తెలివిలేని మృగాలలాగా ఉన్నారు. తమ భ్రష్టత్వంలో పూర్తిగా నాశనమవుతారు. 13 న్యాయం తప్పిన నడతకు ప్రతిఫలం పొందుతారు. వారు పట్టపగలు సుఖభోగాలలో గడపడం సంతోషం అనుకొంటారు. మీ విందులలో పాల్గొంటూ, తమ మోసాలలో సంతోషిస్తూ ఉన్న వీరు వాటిలో కళంకులు, మచ్చలు. 14 వారి కండ్లు వ్యభిచారం చూపులతో నిండి ఉండి పాపం ఎన్నడూ విడిచిపెట్టలేనివి. వారు నిలకడ లేనివారిని మరులుకొలిపేవారు. అత్యాశ విషయంలో వారికి ఆరితేరిన హృదయం ఉంది. వారు శాపానికి గురి అయిన సంతానం.
15 వారు బెయారు కొడుకు బిలాం మార్గాన్ని అనుసరిస్తూ తిన్నని మార్గం విడిచి తొలగిపోయారు. బిలాంకు అన్యాయ సంపాదన అంటే ప్రీతి. 16 అయితే అతడి అపరాధం కారణంగా అతడికి మందలింపు వచ్చింది. చెప్ప లేని గాడిద మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త వెర్రితనాన్ని అడ్డగించింది.
17 వీరు నీళ్ళు లేని బావులు, పెనుగాలికి కొట్టుకుపోయే మబ్బులు. వారికోసం ఉంచబడేది శాశ్వతమైన కటిక చీకటే. 18 వారు వ్యర్థంగా కోతలు కోసే గొప్ప మాటలు చెపుతారు, తప్పు దారిన నడుస్తూ ఉన్న వారిలో నుంచి నిజంగా తప్పించుకొన్నవారిని శరీర స్వభావ దురాశలచేత, పోకిరీ పనులచేత మరులుకొలుపుతారు. 19 తామే భ్రష్టత్వానికి బానిసలై ఉండి వారికి స్వేచ్ఛ ఇస్తామని వాగ్దానం చేస్తున్నారు. ఒక వ్యక్తి తనను వశం చేసుకొన్నదానికి బానిసే అవుతాడు. 20 వారు ప్రభువూ రక్షకుడూ అయిన యేసు క్రీస్తు గురించిన జ్ఞానంవల్ల ఈ లోక కల్మషాల నుంచి తప్పించుకొన్న తరువాత మళ్ళీ వాటిలోనే చిక్కుబడి వాటి వశమైతే వారి చివరి స్థితి మొదటి స్థితికంటే మరీ చెడ్డదవుతుంది. 21 న్యాయ మార్గం తెలిసి, తమకు వచ్చిన పవిత్ర ఆజ్ఞనుంచి వారు తొలగిపోవడంకంటే ఆ మార్గం తెలియకపోవడమే వారికి మేలు. 22 కుక్క తన వాంతికి తిరుగుతుంది, కడిగిన పంది బురదలో దొర్లడానికి తిరిగి పోతుంది అనే నిజమైన సామెత ప్రకారం వీరికి సంభవించింది.