2 పేతురు లేఖ
1
1 మన దేవుడూ రక్షకుడూ అయిన యేసు క్రీస్తు నీతిన్యాయాల మూలంగా మాలాగే అమూల్య విశ్వాసం స్వీకరించినవారికి యేసు క్రీస్తు పంపిన రాయబారీ దాసుడూ అయిన సీమోను పేతురు రాస్తున్న సంగతులు. 2 దేవుణ్ణి, మన ప్రభువైన యేసును గురించిన జ్ఞానం ద్వారా మీకు కృప, శాంతి అధికమవుతాయి గాక!
3 తన మహిమను సుగుణాన్ని బట్టీ మనలను పిలిచిన ఆయనను తెలుసుకోవడం ద్వారా జీవానికీ భక్తికీ కావలసిన దంతా ఆయన దైవిక బలప్రభావాలు మనకు ఇచ్చాయి. 4 ఆ మహిమ, సుగుణాలను బట్టి ఆయన ఎంతో గొప్ప ప్రశస్తమైన వాగ్దానాలు మనకు అనుగ్రహించాడు. వీటి ద్వారా మీరు లోకంలో దురాశవల్ల కలిగిన భ్రష్టత్వంనుంచి తప్పించుకొని దైవిక స్వభావంలో పాలివారు కావాలని ఆయన ఉద్దేశం.
5 ఈ కారణంచేతనే మీరు పూర్ణ శ్రద్ధాసక్తులు కలిగి మీ విశ్వాసంతో సుగుణం సమకూర్చుకోండి. సుగుణంతో జ్ఞానం, 6 జ్ఞానంలో నిగ్రహం, నిగ్రహంతో సహనం, సహనంతో భక్తి, 7 భక్తితో సోదరులపట్ల అనురాగం, ఆ అనురాగంతో దైవిక ప్రేమ సమకూర్చుకోండి. 8 ఇవి మీకు ఉండి అధికం అవుతూ ఉంటే మీరు మన ప్రభువైన యేసు క్రీస్తును గురించిన జ్ఞానంలో వ్యర్థంగా, నిష్‌ఫలంగా ఉండరు. 9 కానీ ఇవి లేని వ్యక్తి తన గత పాపాలకు శుద్ధి కలిగిన విషయం మరచిపోయినవాడు, గుడ్డివాడు, లేదా, దూరదృష్టి లేనివాడు.
10 అందుచేత, సోదరులారా, దేవుడు మిమ్ములను పిలిచి ఎన్నుకొన్న విషయం నిశ్చయం చేసుకోవడానికి మరెక్కువగా శ్రద్ధాసక్తులు వహించండి. వీటి ప్రకారం నడుచుకొంటూ ఉంటే మీరెన్నడూ తొట్రుపడరు. 11 ఈ విధంగా మీకు మన ప్రభువూ రక్షకుడూ అయిన యేసు క్రీస్తు శాశ్వత రాజ్యంలో ప్రవేశం సమృద్ధిగా ఇవ్వడం జరుగుతుంది.
12 కాబట్టి, మీరు ఈ విషయాలు తెలుసుకొని ఉన్న సత్యంలో నిలకడగా ఉన్నా, వీటిని గురించి మీకు ఎప్పుడూ జ్ఞాపకం చేయడానికి నిర్లక్ష్యంగా ఉండను. 13 నా గుడారాన్ని నేను త్వరలో విడిచి పెట్టవలసివస్తుందని నాకు తెలుసు. ఇది మన ప్రభువైన యేసు క్రీస్తు నాకు స్పష్టం చేశాడు, 14 గనుక ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ విషయాలు జ్ఞాపకం చేస్తూ మిమ్ములను పురికొల్పడం యుక్తమని నాకు తోస్తున్నది. 15 అంతేకాక, నేను చనిపోయిన తరువాత కూడా ఈ విషయాలు ఎప్పుడూ మీ జ్ఞాపకంలో ఉండేలా శ్రద్ధాసక్తులు తీసుకొంటాను.
16 ఎందుకంటే మన ప్రభువైన యేసు క్రీస్తు బలప్రభావాలనూ రాకడనూ గురించి మేము మీకు తెలియజేసి నప్పుడు యుక్తితో కల్పించిన కట్టుకథలను అనుసరించి చెప్పలేదు గాని ఆయన దివ్యత్వం మేము కండ్లారా చూచిన వారం. 17  “ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన అంటే నాకెంతో ఆనందం” అనే ఆ స్వరం మహా దివ్య మహిమ స్థలంనుంచి ఆయనకు వినిపించినప్పుడు తండ్రి అయిన దేవుని చేత ఘనత, మహిమ ఆయనకు కలిగాయి. 18  ఆయనతో కూడా మేము ఆ పవిత్ర పర్వతం మీద ఉండి పరలోకంనుంచి వచ్చిన ఆ స్వరం విన్నాం.
19 ఇంతే కాదు, నిశ్చయమైపోయిన భవిష్యద్వాక్కు కూడా మనకు ఉంది. అది చీకటిలో వెలుగిస్తున్న దీపంలాంటిది. అరుణోదయమై వేకువచుక్క మీ హృదయంలో ఉదయించేవరకు ఆ వాక్కు ను మీరు పట్టించుకొంటే మీకు మేలు. 20 అయితే మొట్టమొదట మీరు ఇది తెలుసుకోవాలి – లేఖనంలోని భవిష్యద్వాక్కుల్లో ఏదీ వ్యక్తిగత వివరణవల్ల అర్థం కాదు. 21 ఎందుకంటే, భవిష్యద్వాక్కు అనేది మానవ ఇష్టాన్ని బట్టి ఎన్నడూ రాలేదు గాని దేవుని పవిత్రులైన మనుషులు పవిత్రాత్మవశులై పలికారు.