3
1 ఒకప్పుడు ప్రార్థన కాలంలో – పగలు మూడు గంటలకు – పేతురు, యోహాను దేవాలయానికి వెళ్తూ ఉన్నారు. 2 అప్పుడే కొందరు పుట్టు కుంటి మనిషిని ఒకణ్ణి మోసుకువస్తున్నారు. దేవాలయంలోకి వెళ్ళే వారిదగ్గర బిచ్చం అడుక్కోవడానికి వారు అతణ్ణి ప్రతి రోజూ సౌందర్యం అనే దేవాలయ ద్వారం దగ్గర ఉంచేవారు. 3 పేతురు, యోహాను దేవాలయంలో ప్రవేశించబోతూ ఉంటే చూచి అతడు బిచ్చమడిగాడు.
4 పేతురు, యోహానుతోపాటు అతణ్ణి తేరిపార చూస్తూ “మావైపు చూడు” అన్నాడు. 5 తనకు వారిదగ్గర ఏదైనా దొరుకుతుందని వారివైపు శ్రద్ధతో చూశాడు.
6 అప్పుడు పేతురు “నేను వెండి బంగారాలు ఉన్నవాణ్ణి కాను గాని నాకున్నదేదో అదే నీకిస్తాను. నజరేతువాడైన యేసు క్రీస్తు పేర లేచి నడువు!” అన్నాడు, 7 అతని కుడి చేయి పట్టుకొని అతణ్ణి లేవనెత్తాడు. తక్షణమే అతని పాదాలకూ చీలమండలకూ బలం కలిగింది. 8 అతడు దిగ్గున లేచి నిలబడి నడవసాగాడు. నడుస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వారితోపాటు దేవాలయంలో ప్రవేశించాడు.
9 అతడు నడవడం, దేవుణ్ణి స్తుతించడం ప్రజలంతా చూశారు. 10  అతడు సౌందర్యం అనే ద్వారం దగ్గర బిచ్చమెత్తుకోవడానికి కూర్చుని ఉన్నవాడే అని వారు గుర్తెరిగి అతనికి జరిగినదాని కారణంగా ఆశ్చర్యంతో, విస్మయంతో నిండిపోయారు.
11 బాగుపడ్డ ఆ కుంటివాడు పేతురు యోహానులను అంటిపెట్టుకొని ఉన్నాడు. ‘సొలొమోను మంటపం’లో వారి దగ్గరికి ప్రజలంతా అధికంగా ఆశ్చర్యపడిపోతూ పరుగెత్తు కొంటూ వచ్చారు. 12 ఇది చూచి పేతురు ప్రజతో ఇలా అన్నాడు:
“ఇస్రాయేల్ మనుషులారా! దీనిని గురించి మీరెందుకు ఆశ్చర్యపడుతున్నారు? మేమేదో మా సొంత బలంతో, భక్తితో ఈ మనిషిని నడిచేలా చేసినట్టు ఎందుకు మావైపు తేరి చూస్తున్నారు? 13 అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు – మన పూర్వీకుల దేవుడు – తన సేవకుడైన యేసును గౌరవించాడు. మీరాయనను పిలాతుకు అప్పగించారు, ఆయనను విడుదల చేసే నిర్ణయానికి అతడు వచ్చినప్పుడు అతని ఎదుట మీరు వద్దన్నారు. 14 పవిత్రుడూ న్యాయవంతుడూ అయినవాణ్ణి వద్దని చెప్పి హంతకుణ్ణి మీకు విడుదల చేయాలని కోరారు. 15 మీరు జీవానికి కర్తను చంపించారు గానీ దేవుడు ఆయనను చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపాడు. ఇందుకు మేము సాక్షులం. 16 యేసు పేరుమీద ఉన్న నమ్మకం వల్ల, ఆయన పేరటే ఈ మనిషికి బలం కలిగింది. ఇతణ్ణి మీరు చూస్తున్నారు. ఇతడెవరో మీకు తెలుసు. యేసుమూలంగా కలిగే నమ్మకమే మీ అందరి ఎదుటా ఇతనికి ఈ పూర్తి ఆరోగ్యాన్ని కలిగించింది.
17 “సోదరులారా! మీరు చేసినది తెలియక చేశారని నాకు తెలుసు. మీ నాయకుల సంగతి కూడా అంతే. 18 అయితే తన అభిషిక్తుడు బాధలపాలవుతాడని దేవుడు ప్రవక్తలందరి నోట ముందుగా ప్రకటించినదానిని ఈ విధంగా నెరవేర్చుకొన్నాడు.
19 “కనుక పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగండి! ప్రభు సన్నిధానం నుంచి విశ్రాంతి కాలాలు వచ్చేలా, 20 మీకు ముందుగా ప్రకటించబడిన అభిషిక్తుడైన యేసును ఆయన పంపేలా, మీ పాపాలు నిర్మూలం కావడానికి అలా చేయండి. 21 అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయని లోకారంభం నుంచి దేవుడు తన పవిత్ర ప్రవక్తల నోట పలికించాడు. అంతవరకు యేసు పరలోకంలో ఉండాలి.
22  “మోషే యథార్థంగా పితరులతో అన్నాడు గదా, ‘మీ దేవుడైన ప్రభువు మీకోసం మీ సోదరులలోనుంచి నాలాంటి ప్రవక్తను ఒకణ్ణి బయలుదేరేలా చేస్తాడు. ఆయన మీతో చెప్పేదంతా మీరు చెవిని పెట్టాలి. 23 ఆ ప్రవక్త మాటలు పెడచెవి పెట్టే ప్రతి ఒక్కరూ ప్రజలలో లేకుండా పూర్తిగా నాశనం అవుతారు.’
24 “నిజంగా, సమూయేలు మొదలుకొని ఆ తరువాత మాట్లాడిన ప్రవక్తలందరూ ఈ రోజులను గురించి ముందుగా చాటించారు. 25 మీరు ప్రవక్తల ప్రజలు, మీ పూర్వీకులతో దేవుడు చేసిన ఒడంబడిక ప్రజలు. ఆయన అబ్రాహాముతో అన్నాడు ‘నీ సంతానం మూలంగా లోకంలోని అన్ని వంశాలు ధన్యమవుతాయి.’ 26 దేవుడు తన సేవకుడైన యేసును బయలుదేరదీసి మొట్టమొదట మీదగ్గరకు పంపాడు. మీలో ప్రతి ఒక్కరినీ మీ దుర్మార్గాలనుంచి మళ్ళించడంవల్ల మిమ్ములను ధన్యులుగా చేయాలని ఆయన ఉద్దేశం.”