3
1 నేనిలా అన్నాను: “యాకోబు సంతతి నాయకులారా! ఇస్రాయేల్ ప్రజల అధిపతులారా! వినండి! న్యాయం అంటే ఏమిటో మీరు తెలుసుకోకూడదా? 2 అయితే మీరు మంచిని అసహ్యించుకొంటారు. చెడుగే మీకు ఇష్టం. మీరు నా ప్రజల చర్మాన్ని ఒలిచివేసి వారి ఎముకలమీద ఉన్న మాంసం చీల్చివేస్తారు. 3 నా ప్రజల మాంసాన్ని దిగమ్రింగివేస్తారు. వారి చర్మాన్ని ఒలిచి వారి ఎముకలను విరుగగొట్టేస్తారు. మనుషులు కుండలో వేసే ఎముకలలాగా, బిందెలో వేసే మాంసం లాగా వారిని ముక్కలు చేస్తారు.”
4 ఆ తరువాత వాళ్ళు యెహోవాకు ప్రార్థన చేస్తారు గాని ఆయన వాళ్ళకు జవాబేమి ఇవ్వడు. వాళ్ళు చేసిన చెడుగు కారణంగా ఆ కాలంలో ఆయన తన ముఖం వాళ్ళకు కనిపించకుండా చేస్తాడు.
5 నా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రవక్తలను గురించి యెహోవా చెప్పేదేమంటే, “తమకు భోజనం పెట్టేవారికి ‘క్షేమం’ అని బిగ్గరగా చెపుతారు. ఎవరైనా తమకు భోజనం పెట్టకపోతే వారిమీద పోరాటం జరిగించడానికి సిద్ధపడుతారు. 6 అందుచేత మీకు దర్శనాలేమి రాకుండా రాత్రి కమ్ముకువస్తుంది. మిమ్ములను చీకటి ఆవరిస్తుంది. మీరు భవిష్యత్తు చెప్పలేక పోతారు. ఇలాంటి ప్రవక్తలకు ప్రొద్దు క్రుంకుతుంది. పగలు చీకటిగా మారిపోతుంది. 7 అప్పుడు దీర్ఘదర్శులకు సిగ్గు కలుగుతుంది. సోదె చెప్పే వాళ్ళు పాలిపోతారు. దేవుడు జవాబేమి ఇవ్వకుండా ఉండడం చూచి నోటిని కప్పుకుంటారు.”
8 నేనైతే యాకోబు సంతానానికి వాళ్ళ అతిక్రమాలను, ఇస్రాయేల్ ప్రజలకు వాళ్ళ అపరాధాలను చాటించడానికి యెహోవా ఆత్మ మూలంగా బలప్రభావాలతోను న్యాయ బుద్ధి తోను ధైర్యంతోను నిండినవాణ్ణి. 9 యాకోబు ప్రజల నాయకులారా! ఇస్రాయేల్ ప్రజల అధిపతులారా! వినండి! మీరు న్యాయాన్ని ఏవగించుకొంటూ, సక్రమమైన వాటిని వక్రం చేస్తూ ఉండేవాళ్ళు. 10 మీరు రక్తపాతంతో సీయోనును కట్టేవాళ్ళు, చెడుగుతో జెరుసలం నిర్మించేవాళ్ళు. 11 దాని నాయకులు లంచం తీసుకొని తీర్పు చెప్తారు. యాజులు జీతానికి ఉపదేశిస్తారు, ప్రవక్తలు డబ్బుకోసం సోదె చెప్తారు. అయినా వాళ్ళు యెహోవాను ఆనుకొని “యెహోవా మన మధ్య ఉన్నాడు గదా. ఏ విపత్తు మనమీదికి రాదు” అంటారు. 12 గనుక మీ కారణంగానే సీయోనును పొలంలాగా దున్నడం జరుగుతుంది. జెరుసలం రాళ్ళ కుప్ప అవుతుంది. ఆలయమున్న కొండ దట్టమైన చెట్లు పెరిగిన మట్టి దిబ్బ అవుతుంది.