9
1 అయినా వేదనపాలైన దేశంమీద చీకటి నిలవదు. పూర్వకాలంలో ఆయన జెబూలూను ప్రదేశాన్ని, నఫ్తాలి ప్రదేశాన్ని సిగ్గుపాటు చేశాడు. భవిష్యత్తులో, సముద్రంవైపు యొర్దాను ఇవతల ఉన్న జనాల గలలీ ప్రాంతాన్ని ఆయన గొప్ప చేస్తాడు.
2 చీకటిలో నడిచే ప్రజకు గొప్ప కాంతి కనిపిస్తుంది.
చావునీడ ఉన్న దేశంలో నివసించేవారిమీద వెలుగు ప్రకాశిస్తుంది.
3 నీవు జనసంఖ్య వృద్ధి చేస్తావు. వారి ఆనందాన్ని హెచ్చిస్తావు.
కోతకాలంలో ఉన్న మనుషులలాగా,
దోపిడీ సొమ్ము పంచుకొంటూ ఉన్నవాళ్ళలాగా వారు
నీ సన్నిధానంలో సంతోషిస్తారు.
4 మిద్యానువాళ్ళ ఓటమి రోజున జరిగినట్టు
నీవు వారిమీది బరువైన కాడిని విరుస్తావు.
వారి మెడను కట్టిన కర్రను, వారిని తోలేవాళ్ళ దండాన్ని విరుస్తావు.
5 యుద్ధధ్వని చేసే సైనికులందరి పాదరక్షలూ,
రక్తంలో పొర్లినవారి బట్టలూ నిప్పుపాలై కాలిపోతాయి.
6 ఎందుకంటే, మనకు శిశువు కలిగాడు,
మనకు కుమారుడు ప్రసాదించబడ్డాడు.
ఆయన భుజాలమీద రాజ్యభారం ఉంటుంది.
ఆయనను “ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలాఢ్యుడైన దేవుడు,
అనంత యుగాలకు తండ్రి, శాంతికర్త” అంటారు.
7 ఆయన రాజ్య విస్తీర్ణానికీ శాంతికీ అంతం అంటూ ఉండదు.
ఆయన దావీదు సింహాసనమెక్కి అతడి రాజ్యాన్ని పరిపాలిస్తాడు.
అప్పటినుంచి ఎప్పటికీ ఆయన ఆ రాజ్యాన్ని న్యాయం చేత,
నిజాయితీ చేత బలపరచి, సుస్థిరం చేస్తాడు.
సేనలప్రభువు యెహోవా అత్యాసక్తిపరుడై
దీనిని సాధిస్తాడు.
8 యాకోబువంశానికి వ్యతిరేకంగా ప్రభువు సందేశం పంపాడు.
అది ఇస్రాయేల్‌కు వర్తిస్తుంది.
9 ఎఫ్రాయింవారు, షోమ్రోను నివాసులు,
ప్రజలు అందరూ అది తెలుసుకోవాలి.
వారు విర్రవీగి గర్వంతో ఇలా చెప్పుకొంటున్నారు:
10 “ఇటికలతో కట్టినది కూలింది, చెక్కిన రాళ్ళతో నిర్మిస్తాం.
మేడిచెట్లు నరికివేయబడ్డాయి, వాటికి బదులు
దేవదారు చెట్లను నాటిస్తాం.”
11 అయితే యెహోవా వారికి వ్యతిరేకంగా
రెజీన్‌రాజు శత్రువులను బలపరచాడు,
అతడి పగవాళ్ళను రేపుతున్నాడు.
12 తూర్పున సిరియనులు, పడమట ఫిలిష్తీయవాళ్ళు
నోరు బాగా తెరచి ఇస్రాయేల్‌ను దిగమ్రింగివేశారు.
అయినా దీనితో యెహోవా కోపం చల్లారలేదు.
ఆయన చెయ్యి ఇంకా చాచి ఉంది.
13 అయినా ప్రజలు తమను దెబ్బ తీసిన ఆయనవైపు
తిరగలేదు.
సేనలప్రభువు యెహోవాను వెదకలేదు.
14 అందుచేత యెహోవా ఇస్రాయేల్‌లోనుంచి
ఒకే రోజున తలనూ తోకనూ,
తాటి కమ్మనూ జమ్మిరెల్లునూ కొట్టివేస్తాడు.
15 తల అంటే పెద్దలూ ఘనులూ,
తోక అంటే అబద్ధాలాడే ప్రవక్తలు.
16 ఈ ప్రజల నాయకులు వారిని త్రోవ తప్పిస్తూ ఉన్నారు.
ఆ నాయకులను అనుసరించేవారు నశించిపోతున్నారు.
17 వాళ్ళంతా భక్తిలేనివాళ్ళు, దుర్మార్గులు.
ప్రతి నోటిలోనుంచీ దుర్భాషలు వెలువడుతాయి,
కనుక వాళ్ళ యువకులంటే ప్రభువుకు
సంతోషం లేదు, వారిలో అనాథలు,
వితంతువులంటే జాలి లేదు.
అయినా దీనితో ఆయన కోపం చల్లారలేదు.
ఆయన చెయ్యి ఇంకా చాచి ఉంది.
18 చెడుగు మంటలాగా మండుతుంది.
అది ముండ్ల చెట్లనూ కంటకాలనూ కాల్చివేస్తుంది.
దానివల్ల అడవిలో దట్టమైన పొదలు తగులబడుతాయి.
అది పొగలాగా స్తంభంలాగా పైకి లేస్తూ ఉంది.
19 సేనలప్రభువు యెహోవా కుమ్మరించిన
కోపాగ్నివల్ల దేశం కాలిపోతూ ఉంది.
ప్రజలు మంటలకు కట్టెలలాగా ఉన్నారు.
వాళ్ళలో ఎవడూ తన సోదరుణ్ణి కరుణించడు.
20 కుడి ప్రక్కన ఉన్నదానిని దిగమ్రింగివేస్తారు గాని,
ఇంకా ఆకలితో ఉంటారు.
ఎడమ ప్రక్కన ఉన్నదానిని తింటారు గాని,
తృప్తిపడరు.
వారిలో ప్రతి ఒక్కరూ తమ హస్తాన్ని తామే తింటారు.
21 మనష్షే ఎఫ్రాయింను, ఎఫ్రాయిం మనష్షేను
దిగమ్రింగివేస్తారు.
తరువాత ఒక్కుమ్మడిగా యూదామీద పడుతారు.
అయినా దానితో యెహోవా కోపం చల్లారలేదు.
ఆయన చెయ్యి ఇంకా చాచి ఉంది.