114
1 ఈజిప్ట్‌నుంచి ఇస్రాయేల్‌ప్రజ వచ్చినప్పుడు,
యాకోబువంశం పర భాష మాట్లాడే
జనం దగ్గర నుంచి వచ్చినప్పుడు,
2 దేవునికి యూదా పవిత్ర స్థలమైంది.
ఇస్రాయేల్ ఆయన రాజ్యమైంది.
3  సముద్రం ఇది చూచి పారిపోయింది.
యొర్దాను వెనక్కు తిరిగింది.
4 పర్వతాలు పొట్టేళ్ళలాగా గంతులు వేశాయి.
కొండలు గొర్రెపిల్లల్లాగా గంతులు పెట్టాయి.
5 ఓ సముద్రమా! నీకేం వచ్చిందని ఇలా
పారిపోయావు?
యొర్దాను! నీకేం వచ్చిందే ఇలా వెనక్కు తిరిగావు?
6 పర్వతాల్లారా! మీరు పొట్టేళ్లలాగా గంతులు
వేయడానికి మీకేం వచ్చింది?
కొండల్లారా! మీరు గొర్రెపిల్లలాగా గంతులు
పెట్టడానికి మీకేం వచ్చిందేమిటి?
7  ఓ భూతలమా! ప్రభు సన్నిధానంలో,
యాకోబుయొక్క దేవుని సన్నిధానంలో
గడగడ వణకు!
8 ఆయన బండను నీళ్ళ గుంటగా మార్చేవాడు,
చెకుముకి బండను నీటి ఊటగా
మార్చేవాడు.