18
1 యెహోషాపాతుకు ఎంతో గౌరవం, ఐశ్వర్యం ఉన్నాయి. అయితే అతడు అహాబుతో వియ్యమందాడు. 2 కొన్ని సంవత్సరాల తరువాత అతడు అహాబును సందర్శించడానికి షోమ్రోనుకు వెళ్ళాడు. అహాబు అతనికోసం, అతని వెంట వచ్చిన వారి కోసం చాలా గొర్రెలను, పశువులను వధించాడు. ఆపైన రామోత్ గిలాదుపై దండెత్తడానికి అతణ్ణి ప్రేరేపించాడు. 3 ఇస్రాయేల్ రాజైన అహాబు యూదా రాజైన యెహోషాపాతును చూచి “నాతో కూడా రామోత్‌గిలాదు మీదికి వస్తారా?” అని అడిగాడు.
అందుకు యెహోషాపాతు “మీలాగే నేను సిద్ధంగా ఉన్నాను. మీ జనంలాగే నా జనం సిద్ధంగా ఉంది. మీతో కూడా యుద్ధానికి వస్తాం” అని జవాబిచ్చాడు. 4 అప్పుడు యెహోషాపాతు ఇస్రాయేల్ రాజుతో “ముందు, యెహోవా సందేశంకోసం విచారణ చేద్దాం” అన్నాడు.
5 కాబట్టి ఇస్రాయేల్ రాజు ప్రవక్తలను పిలిపించాడు. వారు నాలుగు వందల మంది. “నేను రామోత్ గిలాదు మీదికి యుద్ధానికి వెళ్ళనా? వద్దా?” అని వారినడిగాడు. “రాజా! దానిని దేవుడు మీ వశం చేస్తాడు. వెళ్ళండి” అని వారి జవాబు.
6 అయితే యెహోషాపాతు “వీళ్ళు గాక మనం విచారణ చేయడానికి యెహోవా ప్రవక్త ఒకడు కూడా ఇక్కడ లేడా?” అనడిగాడు.
7 అందుకు ఇస్రాయేల్ రాజు “ఇంకో ప్రవక్త ఉన్నాడు – ఇమలా కొడుకు మీకాయా. యెహోవా సందేశం కోసం అతడిద్వారా విచారణ చేయవచ్చు. కాని, నాకు అతడంటే ద్వేషం. అతడు నాకు ఎప్పుడూ ప్రతికూలంగా ప్రకటిస్తాడు గాని అనుకూలంగా కాదు” అన్నాడు.
అందుకు యెహోషాపాతు “రాజా, అలా అనవద్దండి” అన్నాడు.
8 గనుక ఇస్రాయేల్ రాజు ఒక ఉద్యోగిని పిలిచి “వెంటనే వెళ్ళి, ఇమలా కొడుకు మీకాయాను తీసుకురా” అని ఆదేశించాడు.
9 ఇస్రాయేల్ రాజు, యూదా రాజైన యెహోషాపాతు రాజవస్త్రాలు ధరించుకొని తమ సింహాసనాలమీద కూర్చుని ఉన్నారు. వారు షోమ్రోను ముఖ్య ద్వారం దగ్గర ఉన్న మైదానంలో ఉన్నారు. వారి సమక్షంలో ఆ ప్రవక్తలంతా పూనకం వచ్చి పలుకుతూ ఉన్నారు.
10 కెనయనా కొడుకు సిద్కియా ఇనుప కొమ్ములు చేసుకొని వచ్చి, “యెహోవా చెప్పినదేమిటంటే, సిరియావాళ్ళు నాశనం అయ్యేటంతవరకు మీరు వీటితో వాళ్ళను పొడుస్తారు” అన్నాడు. 11 ఆ ప్రవక్తలంతా అదే మాట పలికారు. “రాజా! రామోత్ గిలాదును యెహోవా మీ వశం చేస్తాడు. దానిమీదికి వెళ్ళి విజయం సాధించండి” అన్నారు.
12 మీకాయాను పిలవడానికి రాజు పంపగా వెళ్ళిన మనిషి మీకాయాతో అన్నాడు “ఇదిగో వినండి. ప్రవక్తలంతా రాజుకు అనుకూలమైన మాటలు ఏక కంఠంతో పలుకుతున్నారు. మీరు కూడా వాళ్ళలాగే అనుకూలంగా చెప్పండి.”
13 కాని, మీకాయా “యెహోవా జీవం మీద ఒట్టుబెట్టి చెపుతున్నాను, నా దేవుడు చెప్పేదే నేను చెపుతాను” అని జవాబిచ్చాడు.
14 మీకాయా ఇస్రాయేల్ రాజుదగ్గరికి వచ్చినప్పుడు, రాజు “మీకాయా, మేము రామోత్ గిలాదు మీదికి యుద్ధానికి వెళ్ళాలా? వద్దా?” అని అడిగాడు.
“దానిని మీ వశం చేయడం జరుగుతుంది. దానిమీదికి వెళ్ళి విజయం సాధించండి” అని మీకాయా మారు పలికాడు. 15 అందుకు రాజు “యెహోవా పేర సత్యమే నాకు చెప్పమని నేనెన్ని సార్లు నిన్ను ఆదేశించాలి?” అన్నాడు.
16 అప్పుడు మీకాయా అన్నాడు “కాపరి లేని గొర్రెలలాగా ఇస్రాయేల్ ప్రజలంతా కొండలమీద చెదరిపోవడం చూస్తున్నాను. ‘వీరికి నాయకుడు లేడు. వారు ప్రశాంతంగా వారి వారి ఇండ్లకు తిరిగి వెళ్ళవలసింద’ని యెహోవా చెపుతున్నాడు.”
17 యెహోషాపాతుతో ఇస్రాయేల్ రాజు “చూశారా! అతడు ఎప్పుడూ నాకు ప్రతికూలంగానే ప్రకటిస్తాడు గాని అనుకూలంగా కాదని నేను చెప్పానుగా!” అన్నాడు.
18 మీకాయా ఇంకా అన్నాడు “యెహోవా చెప్పేది ఇప్పుడు వినండి. యెహోవా తన సింహాసనం మీద కూర్చుని ఉండడం నేను చూశాను. ఆయన కుడి చేతివైపు, ఎడమ చేతివైపు పరలోక సేనలన్నీ నిలబడి ఉన్నాయి. 19 యెహోవా ‘అహాబు రామోత్ గిలాదు మీదికి వెళ్ళి అక్కడ కూలేలా అతణ్ణి ఎవరు పురికొలుపుతారు?’ అని అడిగినప్పుడు ఒకడు ఒక విధంగా ఇంకొకడు ఇంకో విధంగా చెప్పారు. 20 చివరికి ఒక ఆత్మరూపుడు ముందుకు వచ్చి యెహోవా సమక్షంలో నిలబడి, ‘నేనతణ్ణి పురికొలుపుతాను’ అన్నాడు. 21 ‘ఎట్లా’ అని యెహోవా ప్రశ్న వేసినప్పుడు ఆ ఆత్మ ‘నేను వెళ్ళి అతడి ప్రవక్తల నోట అబద్ధమాడే ఆత్మగా ఉంటాను’ అని చెప్పాడు. యెహోవా ‘నీవు అతణ్ణి పురికొలుపుతావు. నీ ప్రయత్నం సఫలమవుతుంది. వెళ్ళి అలా చెయ్యి’ అన్నాడు.
22 “రాజా, వినండి! యెహోవా మీ గురించి కీడు పలికాడు గనుక, మీ మీ ప్రవక్తల నోట అబద్ధమాడే ఆత్మను ఉంచాడు.”
23 అప్పుడు కెనయనా కొడుకు సిద్కియా, దగ్గరికి వచ్చి మీకాయాను చెంపమీద కొట్టాడు. “నీతో మాట్లాడడానికి యెహోవా ఆత్మ నాదగ్గర్నుంచి వెళ్ళడం ఎలా జరిగిందంటావు?” అన్నాడు.
24 అందుకు మీకాయా “నీవు దాగుకోవడానికి లోపలి గదుల్లోకి చొరబడేటప్పుడు తెలుసుకొంటావు!” అన్నాడు.
25 అప్పుడు ఇస్రాయేల్ రాజు ఇలా ఆదేశించాడు: “మీకాయాను పట్టుకువెళ్ళి, నగరాధ్యక్షుడు ఆమోనుకూ, రాకుమారుడు యోవాషుకూ అప్పచెప్పండి. 26 వాళ్ళతో చెప్పండి, ‘రాజు అంటున్నాడు – ఇతణ్ణి ఖైదులో ఉంచండి. నేను క్షేమంగా తిరిగి వచ్చేవరకూ ఆహారం, నీళ్ళు పరిమితంగా అతడికి ఇవ్వండి’.”
27 అప్పుడు మీకాయా “ఒకవేళ మీరు క్షేమంగా తిరిగి వస్తే యెహోవా నాద్వారా మాట్లాడలేదన్న మాటే” అన్నాడు. “ప్రజలారా, మీరంతా విని అర్థం చేసుకోండి.” అన్నాడు.
28 ఇస్రాయేల్ రాజు, యూదా రాజైన యెహోషాపాతు రామోతు గిలాదు మీదికి వెళ్ళారు. 29 యెహోషాపాతుతో ఇస్రాయేల్ రాజు “యుద్ధానికి పోయినప్పుడు నేను మారు వేషం వేసుకుంటాను. మీరు మాత్రం మీ రాజ వస్త్రాలు ధరించుకోండి” అన్నాడు. అలాగే ఇస్రాయేల్ రాజు మారు వేషం వేసుకొని యుద్ధానికి వెళ్ళాడు.
30 సిరియా రాజు తన రథాలమీద ఉన్న అధిపతులకు ఆజ్ఞ జారీ చేస్తూ “మీరు ఇస్రాయేల్ రాజు ఒక్కణ్ణే ఎదిరించాలి. ఇంకెవరినీ – అల్పుల్ని గానీ ఘనుల్ని గానీ – ఎదిరించకూడదు” అన్నాడు.
31 అయితే ఆ రథాధిపతులు యెహోషాపాతును చూచినప్పుడు, “ఇతడే ఇస్రాయేల్ రాజు” అని చెప్పుకొని అతని పైబడడానికి అతని వైపు తిరిగారు. యెహోషాపాతు మొరపెట్టాడు. యెహోవా అతనికి సహాయం చేశాడు. దేవుడు వాళ్ళను అతనిదగ్గరనుంచి తొలగించాడు. 32 ఎలాగంటే, అతడు ఇస్రాయేల్ రాజు కాడని రథాధిపతులు తెలుసుకొని అతణ్ణి తరమడం మానుకొన్నారు.
33 ఉన్నట్టుండి ఎవడో ఒకడు విల్లెక్కుపెట్టి గురి లేకుండానే బాణం వేశాడు. అది పోయి, ఇస్రాయేల్ రాజుకు కవచం కీళ్ళలో ఒకదాని గుండా దూరింది. రాజు తన రథసారధితో “నాకు గాయం తగిలింది. రథం తిప్పి యుద్ధంనుంచి నన్ను వెనక్కు తీసుకుపో” అన్నాడు. 34 అయితే ఆ రోజు హోరాహోరీగా యుద్ధం చెలరేగింది గనుక, సాయంకాలంవరకు ఇస్రాయేల్‌రాజు సిరియా సైన్యానికి ఎదురుగా అతడి రథంలో ఆనుకొన్నాడు. ప్రొద్దు క్రుంకే వేళ అతడు చనిపోయాడు.