యాకోబు లేఖ
1
1 విదేశాల్లో చెదిరిపోయిన పన్నెండు గోత్రాలకు యాకోబు అభివందనాలతో రాస్తున్న విషయాలు. నేను దేవునికీ ప్రభువైన యేసుక్రీస్తుకూ దాసుణ్ణి.
2 నా సోదరులారా, వివిధమైన విషమ పరీక్షలలో మీరు పడేటప్పుడెల్లా అదంతా ఆనందంగా ఎంచుకోండి.
3 క్రీస్తుమీది మీ నమ్మకాన్ని పరీక్షించడం మీకు సహనం కలిగిస్తుందని మీకు తెలుసు గదా. 4 మీరు ఆధ్యాత్మికంగా పెరిగి సంపూర్ణత పొంది ఏ విషయంలోనూ కొదువ లేనివారై ఉండేలా సహనం తన పని పూర్తి చేయనివ్వండి.
5 మీలో ఎవరికైనా జ్ఞానం కొదువగా ఉంటే దేవుణ్ణి అడగాలి. అప్పుడది ఆ వ్యక్తికి ఇవ్వబడుతుంది. దేవుడు నిందించకుండా అందరికీ ధారాళంగా ఇచ్చేవాడు.
6 అయితే ఆ వ్యక్తి అనుమానమేమీ లేకుండా నమ్మకంతో అడగాలి. అనుమానించే వ్యక్తి గాలికి ఎగిరిపడి కొట్టుకుపోయే సముద్రం అలలాంటివాడు. 7 ఆ మనిషి చపలచిత్తుడు, తన ప్రవర్తన అంతటిలో నిలకడ లేనివాడు. 8 గనుక తనకు ప్రభువువల్ల ఏమైనా దొరుకుతుందని అతడు అనుకోకూడదు.
9 గౌరవం లేని సోదరుడు తన ఉన్నత స్థాయిని బట్టి అతిశయించాలి. 10 ఆస్తిపరుడైన సోదరుడు తనకు వచ్చిన అగౌరవాన్ని బట్టి అతిశయించాలి. ఎందుకంటే ఇతడు గడ్డిపువ్వులాగా గతించిపోతాడు. 11 మాడ్చివేసే వేడితో ప్రొద్దు ఎక్కుతుంది, గడ్డిని ఎండిపోచేస్తుంది. గడ్డిపువ్వు రాలి దాని అందం పాడవుతుంది. అలాగే ఆస్తిపరుడు తన వ్యవహారాలలో నీరసించిపోతాడు.
12 విషమపరీక్షను ఓర్చుకొనే మనిషి ధన్యజీవి. ఎందుకంటే అతడు పరీక్షకు నిలిచి మెప్పు పొందిన తరువాత అతనికి జీవ కిరీటం లభిస్తుంది. ప్రభువు తనను ప్రేమించేవారికి దానిని వాగ్దానం చేశాడు.
13 ఎవరికైనా దుష్ట ప్రేరేపణ వస్తే ఆ వ్యక్తి “ఈ దుష్ట ప్రేరేపణ దేవుడు నాకు కలిగిస్తున్నాడు” అనకూడదు. ఎందుకంటే, దుర్మార్గత చేయడానికి దేవునికి ప్రేరేపణ కలగడం అసాధ్యం. అలాంటి ప్రేరేపణ ఎవరికీ కలిగించడు కూడా. 14 ప్రతి ఒక్కరూ తన కోరికలు తనను ఆకర్షించి ఈడ్వడంవల్లే దుష్ట ప్రేరేపణకు గురి కావడం జరుగుతుంది. 15 కోరిక గర్భం ధరించి పాపాన్ని కంటుంది. పాపం పండి చావును కంటుంది. 16 నా ప్రియ సోదరులారా, మోసపోకండి.
17 ప్రతి మంచి ఈవీ, పరిపూర్ణమైన ప్రతి ఉచిత వరమూ పైనుంచే వస్తాయి, జ్యోతులకు కర్త అయిన తండ్రినుంచే వస్తాయి. ఆయన విషయంలో మార్పు, భ్రమణ ఛాయలు అంటూ ఏమీ లేవు. 18 తన సృష్టిలో మనం తొలి పంటగా ఉండాలని తన సంకల్పం ప్రకారం తన సత్యవాక్కుద్వారా మనకు నూతన జన్మం కలిగించాడు.
19 అందుచేత నా ప్రియ సోదరులారా, ప్రతి ఒక్కరూ వినడానికి ఆతురంగా, మాట్లాడడానికీ కోపగించడానికీ నిదానంగా ఉండాలి. 20 ఎందుకంటే మనిషి కోపం దేవుని న్యాయాన్ని సాధించదు. 21 అందుచేత సమస్తమైన మాలిన్యం, మిగిలి ఉన్న దుష్టత్వాన్ని విసర్జించి లోపల నాటుకొన్న వాక్కును అణుకువతో స్వీకరించండి. అది మీ ఆత్మలను రక్షించే శక్తిగలది.
22 వాక్కు ప్రకారం ప్రవర్తిస్తూ ఉండండి. దానిని ఊరికే విని మిమ్ములను మీరే మోసగించుకోకండి. 23 వాక్కు విని దాని ప్రకారం ప్రవర్తించని వ్యక్తి అద్దంలో తన ముఖం ఉన్నది ఉన్నట్టే చూచుకొనేవాడిలాగా ఉన్నాడు. 24 అతడు తనను చూచుకొని అవతలికి వెళ్ళిన వెంటనే తానెలాంటివాడో మరచి పోతాడు. 25 కానీ పరిపూర్ణ విముక్తి నియమంలోకి పరీక్షగా చూస్తూ తాను విన్నది మరవకుండా ఆచరణలో పెడుతూ ఉన్న వ్యక్తికి తాను చేస్తున్న దానిమీద దీవెన కలుగుతుంది.
26  మీలో ఎవరైనా తాను మత నిష్ఠ గలవాణ్ణి అనుకొంటూ నాలుకను అదుపులో ఉంచుకోకుండా తన హృదయాన్ని తానే మోసగించుకొంటే అతడి మతం వట్టిదే! 27 తండ్రి అయిన దేవుని దృష్టిలో కళంకం లేని పవిత్రమైన మతనిష్ఠ ఇదే – అనాథ పిల్లలనూ విధవరాండ్రనూ వారి కష్టాలలో సందర్శించి సహాయం చేయడం, లోక మాలిన్యం తనకు అంటకుండా కాపాడుకోవడం.