అపొస్తలుల కార్యాలు
1
1 ఓ తియొఫిలస్, యేసు ఏమేమి చేయడానికీ ఉపదేశించడానికీ మొదలుపెట్డాడో వాటన్నిటిని గురించి నా మొదటి పుస్తకం వ్రాశాను. 2  ఆయనను పరలోకానికి తీసుకువెళ్ళడం జరిగేవరకూ ఆ క్రియలు చేస్తూ ఉన్నాడు. చివరికి తాను ఎన్నుకొన్న రాయబారులకు పవిత్రాత్మ ద్వారా ఆదేశాలు ఇచ్చాడు. 3 ఆయన బాధల తరువాత అనేక రుజువులచేత తనను సజీవంగా వారికి కనపరచుకొన్నాడు. నలభై రోజులపాటు ఆయన వారికి కనబడుతూ దేవుని రాజ్యానికి చెందే విషయాలను గురించి ఉపదేశించాడు.
4  ఆయన వారితో సమావేశమై వారు జెరుసలం విడిచి వెళ్ళకూడదనీ తండ్రి వాగ్దానం చేసినదాని కోసం చూస్తూ ఉండాలనీ వారికి ఆజ్ఞాపించాడు, “దాని గురించి నా వల్ల మీరు విన్నారు. 5 యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు గాని కొన్ని రోజులలోగా మీరు పవిత్రాత్మలో బాప్తిసం పొందుతారు” అన్నాడు.
6 వారు అలా సమకూడినప్పుడు “ప్రభూ, నీవు ఇస్రాయేల్ ప్రజకు రాజ్యం మళ్ళీ అనుగ్రహించేది ఈ కాలంలోనా?” అని ఆయనను అడిగారు.
7 అందుకు ఆయన వారితో అన్నాడు “తండ్రి తన అధికారంచేత కాలాలూ సమయాలూ నిర్ణయించాడు. వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. 8  అయితే పవిత్రాత్మ మిమ్ములను ఆవరించినప్పుడు మీరు బలప్రభావాలు పొందుతారు. జెరుసలంలో, యూదయ, సమరయ ప్రదేశాలలో నలుదిక్కులకు, భూమి కొనలవరకూ కూడా మీరు నాకు సాక్షులై ఉంటారు.”
9 ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత వారు చూస్తూ ఉండగానే ఆయనను పైకి తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన వారి కండ్లకు కనిపించకుండా మేఘం ఒకటి ఆయనను ఎత్తుకు పోయింది. 10 ఆయన పైకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వారు ఆకాశంవైపు తేరి చూస్తూ ఉన్నారు. హఠాత్తుగా తెల్లని బట్టలు ధరించిన ఇద్దరు పురుషులు వారి దగ్గర నిలిచి ఇలా అన్నారు:
11 “గలలీ మనుషులారా! మీరెందుకు నిలుచుండి ఆకాశంవైపు చూస్తూ ఉన్నారు? మీ దగ్గరనుంచి యేసును పరలోకానికి చేర్చుకోవడం జరిగింది. ఈయన ఏ విధంగా పరలోకానికి వెళ్ళడం మీరు చూశారో ఆ విధంగానే తిరిగి వస్తాడు.”
12 అప్పుడు శిష్యులు ఆలీవ్ కొండ నుంచి జెరుసలంకు తిరిగి వచ్చారు. ఆ కొండ జెరుసలంకు దగ్గరగా విశ్రాంతి దినాన నడవతగినంత దూరాన ఉంది. 13 పట్టణం చేరి వారు బస చేస్తున్న మేడగదిలోకి వెళ్ళారు. వారెవరంటే, పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్‌తొలొమయి, మత్తయి, అల్ఫయి కొడుకు యాకోబు, తీవ్రవాది సీమోను, యాకోబు కొడుకు యూదా. 14 వీరంతా, వీరితోకూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి మరియ, ఆయన తమ్ముళ్ళు ఏక మనసుతో నిలకడగా ప్రార్థన, విన్నపాలు చేస్తూ ఉన్నారు. 15 సమకూడినవారి పేర్ల సంఖ్య సుమారు నూట ఇరవైమంది. ఆ కాలంలో ఆ శిష్యుల మధ్య పేతురు నిలబడి ఇలా అన్నాడు:
16 “సోదరులారా, యేసును పట్టుకొన్నవారికి దారి చూపిన యూదాను గురించి పవిత్రాత్మ దావీదు ద్వారా పూర్వం పలికించిన లేఖనం నెరవేరవలసి వచ్చింది. 17 అతడు మనలో ఒకడుగా ఎంచబడి ఈ సేవలో భాగస్థుడయ్యాడు. 18  (దుర్మార్గంవల్ల లభించిన డబ్బుచేత ఈ మనిషి ఒక పొలం కొన్నాడు. వాడు తలక్రిందులుగా పడి నడిమికి బ్రద్దలయ్యాడు. వాడి పేగులన్నీ బయటికి వచ్చాయి. 19 ఈ సంగతి జెరుసలంలో కాపురమున్న వారంతా తెలుసుకొన్నారు గనుక వారి భాషలో ఆ పొలానికి “అకెల్ దామ” అనే పేరు వచ్చింది. ఆ మాటకు రక్తభూమి అని అర్థం).
20 “కీర్తనల గ్రంథంలో ఈ విధంగా రాసి ఉంది: వాడి నివాసం పాడైపోతుంది గాక! దానిలో ఎవడూ బతకకుండా పోతాడు గాక! అతడి ఉద్యోగం మరొకరి పాలవుతుంది గాక. 21 అందువల్ల ఒక విషయం తప్పనిసరి – యోహాను బాప్తిసం ఇచ్చిన కాలం మొదలుకొని యేసుప్రభువును మన దగ్గరనుంచి పైకి చేర్చడం జరిగేరోజు వరకూ – ఆయన మనమధ్య సంచారం చేస్తూ ఉన్న కాలమంతా – 22 మనతో కూడా ఉన్న పురుషులలో ఒకడు మనతోపాటు ఆయన పునర్జీవితానికి సాక్షి అయి ఉండాలి” అన్నాడు.
23 అప్పుడు వారు యోసేపు, మత్తీయ అనే ఇద్దరిని నిలబెట్టారు (యోసేపుకు “యూస్తస్” అనే ఇంటి పేరు ఉంది. అతణ్ణి “బర్సబ్బా” అని కూడా పిలుస్తారు). 24 అప్పుడు వారు ప్రార్థన చేస్తూ ఇలా అన్నారు: “ప్రభూ! అందరి హృదయాలు నీకు తెలుసు. 25 యూదా తన చోటికి వెళ్ళేందుకు అతిక్రమంవల్ల విడిచిపెట్టిన రాయబారి పదవిలో సేవలో పాల్గొనడానికి ఈ ఇద్దరిలో నీవు ఎన్నుకొన్నవాణ్ణి చూపించు.”
26 అప్పుడు వారిని గురించి చీట్లు వేశారు. మత్తీయ పేర చీటి వచ్చింది గనుక అతణ్ణి పదకొండుమంది రాయబారులలో ఒకడుగా ఎంచడం జరిగింది.