14
1 వినండి! మీ దోపిడీసొమ్మును మీ మధ్య పంచిపెట్టే యెహోవా దినం రాబోతుంది. 2 “జనాలన్నిటినీ జెరుసలంమీద యుద్ధం చేయడానికి వాటిని సమకూర్చి రప్పిస్తాను.” వారు నగరాన్ని పట్టుకొంటారు. ఇండ్లను దోచుకొంటారు. స్త్రీలను చెరుపుతారు. నగరవాసులలో సగంమంది బందీలుగా దేశాంతరం పోతారు. అయితే తక్కినవారు నాశనం కాకుండా నగరంలో ఉండిపోతారు. 3 అప్పుడు యెహోవా బయలుదేరి యుద్ధకాలంలో పోరాడే విధంగా ఆ జనాలతో యుద్ధం చేస్తాడు. 4 ఆ రోజున ఆయన జెరుసలంకు తూర్పుగా ఉన్న ఆలీవ్ కొండమీద పాదాలు ఉంచుతాడు. ఆలీవ్‌కొండ తూర్పు దిక్కుకూ పడమటి దిక్కుకూ నడిమికి చీలిపోతుంది. సగం కొండ ఉత్తర దిక్కుకు, సగం కొండ దక్షిణ దిక్కుకు జరిగిపోతుంది, మధ్యలో మహా గొప్ప లోయ ఏర్పడుతుంది. 5 కొండల మధ్య నేను చేసే ఆ లోయ ఆజీల్ వరకు ఉంటుంది. మీరు ఆ లోయగుండా పారిపోతారు. యూదా రాజైన ఉజ్జియా కాలంలో భూకంపం వచ్చినప్పుడు ప్రజలు పారిపోయినట్టు మీరు పారిపోతారు. అప్పుడు నా దేవుడు యెహోవా వస్తాడు. నీతోపాటు పవిత్రులందరూ వస్తారు.
6 ఆ రోజున వెలుగు ఉండదు జ్యోతుల ప్రకాశం తగ్గిపోతుంది. 7 అది వింతైన రోజుగా ఉంటుంది పగలు కాదు, రాత్రీ కాదు. ఆ రోజు యెహోవాకు తెలుసు. సాయంకాలం సమయాన వెలుగు ఉంటుంది. 8 ఆ రోజున క్రొత్త నీటి ధారలు జెరుసలంలో నుంచి వెలువడతాయి. సగం తూర్పు సముద్రానికి, సగం పడమటి సముద్రానికి పారుతుంది. ఎండకాలంలోను చలికాలంలోను అలాగే పారుతూ ఉంటుంది.
9 యెహోవా సర్వలోకానికి రాజై ఉంటాడు. ఆ కాలంలో యెహోవా ఒక్కడే ప్రభువై ఉంటాడు. ఆయన పేరు ఒక్కటే ఉంటుంది.
10 అప్పుడు గెబనుంచి జెరుసలంకు దక్షిణంగా ఉన్న రిమ్మోనువరకు ఆ ప్రదేశమంతా మైదానం అవుతుంది. జెరుసలం ఎత్తుగా ఉంటుంది. “బెన్యామీను ద్వారం” నుంచి “మూలద్వారం” (మొదటిద్వారం ఉన్నస్థలం) వరకూ, హననయేల్ గోపురంనుంచి రాజు ద్రాక్ష గానుగవరకూ జెరుసలం దాని స్థలంలోనే నిలుస్తుంది. 11 మనుషులు దానిలో నివాసం ఉంటారు. అప్పటినుంచి అది ఎన్నడూ నాశనానికి గురి కాదు. జెరుసలం సురక్షితంగా ఉంటుంది.
12 జెరుసలంమీద యుద్ధం చేసిన జనాలన్నీ యెహోవాచేత ఇలా దెబ్బ తింటాయి: వారు నిలబడి ఉండగానే వారి శరీరాలు కుళ్ళిపోతాయి. వారి కండ్లు కనుతొర్రలలో ఉండికూడా కుళ్ళిపోతాయి. వారి నాలుకలు నోళ్ళలో ఉండి కూడా కుళ్ళిపోతాయి. 13 ఆ రోజున యెహోవా వల్ల వారికి గొప్ప భయాందోళన ముంచుకు వస్తుంది. వారంతా ఒకరినొకరు పట్టుకొంటారు. ఒకరినొకరు దెబ్బ తీస్తారు. 14 యూదావారు కూడా జెరుసలందగ్గర యుద్ధం చేస్తారు. చుట్టూరా ఉన్న ఇతర జనాల ధనమంతా చాలా బంగారం, వెండి, వస్త్రాలు అక్కడ పోగు చేయడం జరుగుతుంది. 15 ఆ దెబ్బలాంటిది వారి శిబిరాలలో ఉన్న గుర్రాలకూ కంచరగాడిదలకూ ఒంటెలకూ గాడిదలకూ పశువులన్నిటికీ తగులుతుంది.
16 జెరుసలం పైబడ్డ ఆ జనాలలో మిగిలేవారంతా ఏటేటా జెరుసలంకు వస్తారు. రాజూ సేనలప్రభువూ అయిన యెహోవాను ఆరాధించడానికి పర్ణశాల పండుగ ఆచరించడానికి వస్తారు. 17 ఒకవేళ లోక జనాలలో ఏ జనమైనా రాజూ సేనలప్రభువూ అయిన యెహోవాను ఆరాధించడానికి జెరుసలంకు రాకపోతే వారికి వాన కురియదు. 18 ఈజిప్ట్ ప్రజ రాకపోతే, ఆరాధనలో పాల్గొనకపోతే వారికి వర్షం ఉండదు. పర్ణశాల పండుగ ఆచరించడానికి రాని ఇతర జనాలకు యెహోవా నియమించిన ఆ దెబ్బ వారికి తగులుతుంది. 19 ఈజిప్ట్‌వారూ పర్ణశాల పండుగ ఆచరించడానికి రాని ఇతర జనాలన్నీ పొందవలసిన శిక్ష అదే.
20 ఆ కాలంలో గుర్రాలకు కట్టిన గంటలమీద “యెహోవాకు పవిత్రమైనది” అని వ్రాసి ఉంటుంది. యెహోవా ఆలయంలో ఉన్న వంట పాత్రలు బలి పీఠం ఎదుట ఉన్న గిన్నెల్లాగే పవిత్రంగా ఎంచబడతాయి. 21 జెరుసలంలోను యూదాలోను ఉన్న పాత్రలన్నీ సేనలప్రభువు యెహోవాకు పవిత్రం అవుతాయి. బలి అర్పించడానికి వచ్చేవారంతా ఆ పాత్రల్లో కావలసినవాటిని తీసుకొని వంట చేసుకొంటారు. ఆ కాలంలో కనాను జాతివాడెవడూ సేనలప్రభువు యెహోవా ఆలయంలో ఉండడు.