9
1 బలిపీఠం దగ్గర యెహోవా నిలబడి ఉండడం నేను చూశాను. ఆయన ఇలా అన్నాడు: “గడపలు కదలి పోయేలా స్తంభాల పై భాగాలను కొట్టు. పై కప్పు అందరి తలలమీదా పడేలా వాటిని పగలగొట్టు. మిగిలిన వాళ్ళను తరువాత నేను కత్తిపాలు చేస్తాను. ఒక్కడూ కూడా పారిపోలేడు. ఎవ్వరూ తప్పించుకోరు. 2  వాళ్ళు మృత్యులోకం వరకు రంధ్రం తొలుచుకొని పోయినా, అక్కడనుంచి నా చెయ్యి వాళ్ళను బయటికి లాగివేస్తుంది. అంతరిక్షం ఎక్కిపోయినా, అక్కడనుంచి కూడా వాళ్ళను దించివేస్తాను. 3 వాళ్ళు కర్మెల్ పర్వత శిఖరాన దాక్కొన్నా, నేను వాళ్ళ వెంటబడి అక్కడ వాళ్ళను పట్టుకొంటాను. నా కండ్లకు కనిపించకుండా వాళ్ళు సముద్రం క్రిందిభాగంలో దాక్కొన్నా, అక్కడి సర్పానికి వాళ్ళను కరువమని ఆజ్ఞాపిస్తాను. 4 శత్రువులు వాళ్ళను బందీలుగా దేశాంతరం తీసుకుపోయినా, అక్కడ ఖడ్గం ధరించినవారికి వాళ్ళను చంపమని ఆజ్ఞాపిస్తాను. వాళ్ళమీదికి మేలు కాదు, కీడే వచ్చేలా నా చూపు వాళ్ళమీద నిలుపుతాను.”
5 ఆయన ప్రభువు, సేనలప్రభువు యెహోవా. ఆయన భూమిని తాకితే అది కరిగిపోతుంది, భూనివాసులంతా విలపిస్తారు. నైలు నదిలాగా అదంతా లేస్తుంది. ఈజిప్ట్‌లోని నదిలాగా అణగిపోతుంది. 6 ఆయన తన కోసం ఆకాశాలలో మేడగదులు కట్టుకొనేవాడు. ఆకాశ మండలాన్ని భూమికి పైగా సుస్థిరం చేసేవాడు. సముద్రం నీళ్ళనూ భూతలం మీద కురిపించడానికి రప్పించేవాడు. ఆయన పేరు యెహోవా.
7 “ఇస్రాయేల్ ప్రజలారా! నా దృష్టిలో మీరూ కూషుదేశస్ధులూ సమానులే గదా. ఇస్రాయేల్ ప్రజను ఈజిప్ట్ నుంచి తెచ్చిన నేను ఫిలిష్తీయప్రజను కఫ్తోరునుంచి, సిరియా ప్రజను కీరునుంచి తెచ్చాను గదా” అని యెహోవా అంటున్నాడు.
8 “ప్రభువైన యెహోవా అనే నేను ఈ పాపిష్టి రాజ్యాన్ని కండ్లారా చూస్తున్నాను. అయినా యాకోబు వంశాన్ని పూర్తిగా నాశనం చేయను” అని యెహోవా అంటున్నాడు. 9 “ఇప్పుడు నేను ఆజ్ఞ జారీ చేస్తున్నాను. మనిషి ధాన్యం జల్లెడలో వేసి ఒక గింజ కూడా నేల పడకుండా జల్లించే విధంగా ఇస్రాయేల్ ప్రజను అన్ని దేశాలవారి మధ్య జల్లిస్తాను. 10 నా ప్రజలో ‘విపత్తు మనలను అందుకోదు, మనమీదికి రాదు’ అని చెప్పుకొనే పాపాత్ములందరూ ఖడ్గానికి గురి అయి చస్తారు.
11  “శిథిలమైపోయిన దావీదు నివాసం ఆ కాలంలో నిలబెట్టి దాని గోడలను బాగు చేస్తాను. పాడైన భాగాలను బాగు చేస్తాను. అది మునుపు ఉన్నట్టు దాన్ని మళ్ళీ నిర్మిస్తాను. 12 వారు ఎదోం జనంలో మిగిలినవారినీ నా పేరు ధరించిన ఇతర ప్రజలనందరినీ స్వాధీనం చేసుకొనేలా నేను ఈ విధంగా చేస్తాను” అంటున్నాడు యెహోవా. ఆయన అలాగే జరిగిస్తాడు.
13 “ఒక కాలం రాబోతుంది. అప్పుడు మనుషులు పంట కోస్తూ ఉండగానే భూమి దున్నడానికి మనుషులు వస్తారు. విత్తనాలు చల్లుతూ ఉండగానే ద్రాక్ష పండ్లు త్రొక్కేవారు వస్తారు. పర్వతాలమీద నుంచి మధురమైన ద్రాక్షరసం పారుతుంది. అది కొండలన్నిటి మీద నుంచి ప్రవహిస్తుంది. 14 నేను బందీలుగా దేశాంతరం పోయిన నా ఇస్రాయేల్ ప్రజను తిరిగి తీసుకువస్తాను. వారు శిథిలమైన పట్టణాలను మళ్ళీ కట్టుకొని వాటిలో నివాసం ఉంటారు. ద్రాక్షతోటలు నాటి ద్రాక్షరసం త్రాగుతారు, తోటలు వేసి పండ్లు తింటారు. 15  నేను ఇస్రాయేల్ ప్రజను వారి స్వదేశంలో నాటుతాను. నేను వారికిచ్చిన దేశంలోనుంచి వారిని పెళ్ళగించడం ఇంకెన్నడూ జరుగదు. ఇది మీ దేవుడు యెహోవా వాక్కు.”