12
1 “ఆ కాలంలో మిఖాయేల్ – నీ ప్రజల తరఫున నిలబడే ఆ గొప్ప అధిపతి – నిలబడుతాడు. అప్పుడు బాధకాలం వస్తుంది. ప్రజలు రాజ్యాలుగా ఏర్పడ్డ కాలంనుంచీ అప్పటివరకు ఎన్నడూ సంభవించనంత బాధకాలం అది. అయితే ఆ కాలం వచ్చేటప్పుడు నీ ప్రజలతో ఎవరి పేర్లు గ్రంథంలో వ్రాసి ఉన్నాయో వారు తప్పించుకొంటారు. 2 అంతే గాక, నేలమట్టిలో నిద్ర పోయినవారిలో చాలామంది సజీవంగా లేస్తారు. వీరు శాశ్వత జీవంలోకి లేస్తారు. మిగిలినవారు నిందపాలు కావడానికీ శాశ్వత తిరస్కారానికీ లేస్తారు. 3 అప్పుడు తెలివితేటలున్నవారు ఆకాశంలో ఉన్న జ్యోతులలాగా ప్రకాశిస్తారు. అనేకులను న్యాయవంతులను చేసేవారు నక్షత్రాలలాగా శాశ్వతంగా ప్రకాశిస్తూ ఉంటారు. 4 దానియేలూ! ఈ మాటలను భద్రపరచు. అంతిమ కాలంవరకు గ్రంథం ముద్రించివెయ్యి. జ్ఞానం వృద్ధి అవుతుందని చెప్పి చాలామంది అటూ ఇటూ పరుగెత్తుతూ ఉంటారు.”
5 అప్పుడు నేను – దానియేలును – నదివైపు చూచినప్పుడు ఇద్దరు వ్యక్తులు కనబడ్డారు. ఒకడు అవతలి ఒడ్డున, ఒకడు ఇవతలి ఒడ్డున నిలుచున్నారు. 6 వారిలో ఒకడు, శ్రేష్ఠమైన బట్టలు తొడుక్కొని నది జలాల పైగా ఉన్నవాణ్ణి ఇలా ప్రశ్నించాడు: “ఎంతకాలానికి ఆశ్చర్యకరమైన ఆ సంగతులు ముగిసిపోతాయి?” 7 శ్రేష్ఠమైన బట్టలు తొడుక్కొని నది జలాల పైగా ఉన్నవాడు తన కుడిచెయ్యి, ఎడమచెయ్యి రెండూ ఆకాశంవైపుకు ఎత్తి నిత్య సజీవుడైన దేవుని పేర ఇలా శపథం చేశాడు: “ఒక కాలం, రెండు కాలాలు, అర్ధకాలం పడుతుంది. పవిత్ర ప్రజల బలాన్ని కొట్టివేయడం జరిగేటప్పుడు ఈ సంగతులన్నీ ముగిసిపోతాయి.” అది నేను విన్నాను.
8 అది నేను విన్నాను గానీ గ్రహించలేదు. గనుక “నా యజమానీ! వీటి పర్యవసానమేమిటి?” అని అడిగాను.
9 అతడు ఇలా జవాబిచ్చాడు: “దానియేలూ! నీవిప్పుడు వెళ్ళిపో. ఎందుకంటే ఈ సంగతులు చివరి కాలంవరకు భద్రంగా ముద్రవేసి ఉన్నాయి. 10 చాలామంది శుద్ధులూ పవిత్రులూ విషమ పరీక్షలకు నిలిచినవారవుతారు. దుర్మార్గులు ఇంకా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దుర్మార్గులలో ఎవ్వడూ అర్థం చేసుకోడు. గానీ, జ్ఞానం ఉన్నవారు అర్థం చేసుకొంటారు. 11 రోజూ అర్పించే అర్పణను నిలిపివేయడం, అసహ్యమైన వినాశకారిని నిలపడం జరిగే కాలం నుంచీ 1,290 రోజులు గడిచిపోతాయి. 12 ఎదురు చూస్తూ, 1,335 రోజుల ముగింపువరకు బ్రతికేవారు ధన్యులు! 13 నీవైతే అంతం వరకు సాగిపో. అప్పుడు నీవు విశ్రమిస్తావు. నీకోసం నిర్ణయించిన వారసత్వాన్ని పొందడానికి చివరి కాలంలో నిలబడుతావు.”