యోహాను రాసిన రెండవ పత్రిక
గ్రంథకర్త
అపోస్తలుడు యోహాను. వ. 1 లో అతడు తనను “పెద్ద” గా పరిచయం చేసుకున్నాడు. పత్రిక శీర్షిక 2 యోహాను. అపోస్తలుడు యోహాను పేరున్న మూడు పత్రికల వరసలో ఇది రెండవది. ఈ పత్రికలో ముఖ్యాంశం కపట బోధకులు. వీరు యోహానుకు పరిచయం ఉన్న సంఘాల్లో తరచుగా వచ్చి బోధిస్తున్నారు. కొందరిని తమ వైపుకు తిప్పుకుంటున్నారు. తమ కార్య సాధనకు క్రైస్తవ అతిథి గుణాన్ని వాడుకుంటున్నారు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 85 - 95
రచన జరిగిన స్థలం బహుశా ఎఫెసు కావచ్చు.
స్వీకర్త
ఈ రెండవ పత్రికను “ప్రియమైన అమ్మగారు, ఆమె పిల్లలు” అని వర్ణించిన సంఘానికి యోహాను రాశాడు.
ప్రయోజనం
యోహాను తన రెండవ పత్రికను ఆ అమ్మగారు, ఆమె పిల్లలు కనుపరచిన నమ్మకత్వాన్ని ప్రశంసిస్తూ రాశాడు. ప్రేమలో నడుచుకుంటూ, ప్రభు ఆజ్ఞలు పాటిస్తూ ఉండమని ఆమెను పురిగొల్పుతున్నాడు. కపట బోధకుల గురించి హెచ్చరిస్తూ తాను త్వరలో అక్కడికి వస్తున్నానని చెప్పాడు. ఆమెను సహోదరి అని కూడా సంబోధించాడు.
ముఖ్యాంశం
విశ్వాసికి ఉండవలసిన వివేచన.
విభాగాలు
1. అభినందనలు — 1:1-3
2. ప్రేమ పూర్వక సత్యంలో నిలకడగా ఉండడం — 1:4-11
3. హెచ్చరిక — 1:5-11
4. అంతిమ శుభాకాంక్షలు — 1:12, 13