తెస్సలోనీకయులకు రాసిన రెండవ పత్రిక
గ్రంథకర్త
1 తెస్స లాగానే ఈ పత్రిక కూడా పౌలు, సీలా, తిమోతిలు రాసినదే. మొదటి పత్రిక, పౌలు రాసిన ఇతర పత్రికల శైలి ఇందులో కనిపిస్తుంది. దీన్నిబట్టి పౌలు ముఖ్య రచయిత అనీ సీల, తిమోతి లా పేర్లను పరిచయ వాక్యాల్లో చేర్చాడనీ తెలుస్తున్నది (1:1). “మేము” రాసిన అనేక వచనాలలో ఆ ముగ్గురూ సమ్మతించి రాశారు అనుకోవచ్చు. చేవ్రాత పౌలుది కాదు ఎందుకంటే అతడు చివరి అభినందన మాటలు మాత్రం స్వంతగా రాశాడు. (3:7). బహుశా పౌలు చెబుతుంటే సీల గానీ తిమోతి గానీ రాసి ఉంటారు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 50 - 52
ఈ పత్రికను పౌలు మొదటి పత్రిక లాగానే కొరింతి పట్టణం నుండి రాశాడు.
స్వీకర్త
1:1 ప్రకారం ఈ పత్రిక అందుకున్న వారు తెస్సలోనిక సంఘ విశ్వాసులు.
ప్రయోజనం
ప్రభువు దినం గురించి ఆ రోజుల్లో నెలకొన్న తప్పు సిద్దాంతాన్ని సరిదిద్దడం ఈ పత్రిక ఉద్దేశం. ఆ సంఘం వారు తమ విశ్వాసంలో నిలకడగా ఉన్నందుకు వారిని మెచ్చుకుంటూ అంత్య దినాల గురించి కొందరిలో తమను తామే మోసం చేసుకునే పొరపాటు నమ్మకాలను బట్టి వారిని పౌలు గద్దిస్తున్నాడు. ప్రభువు దినం వచ్చేసిందని, ప్రభువు త్వరలో వస్తున్నాడు అని భావించి ఈ సిద్ధాంతాన్ని తమ స్వలాభానికి వారు ఉపయోగించుకుంటున్నారు.
ముఖ్యాంశం
సజీవమైన ఆశాభావం
విభాగాలు
1. అభివాదం — 1:1, 2
2. ఇబ్బందుల్లో ఆదరణ — 1:3-12
3. ప్రభువు దినం గురించి దిద్దుబాటు — 2:1-12
4. వారి అంతిమ గమ్యం గురించి వారికి జ్ఞాపకం చేయడం — 2:13-17
5. ఆచరణాత్మక విషయాల గురించి హెచ్చరికలు — 3:1-15
6. చివరి అభినందనలు — 3:16-18