యోహాను రాసిన సువార్త
గ్రంథకర్త
యోహాను 21:20-24 ను బట్టి ఈ సువార్త రచయిత జెబెదయి కుమారుడు యోహాను అని తెలుస్తున్నది. యోహాను తనను యేసు శిష్యుడిగా చెప్పుకున్నాడు. అతడు, అతని సోదరుడు యాకోబు “ఉరిమే వారు” అని పేరు పొందారు (మార్కు 3:17). యేసు జీవిత సంభవాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం వీరిద్దరికీ దక్కింది.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 80 - 95
యోహాను తన సువార్తను ఎఫెసు నుండి రాసి ఉండవచ్చు. రచన జరిగిన ముఖ్య ప్రదేశాలు బేతని, గలిలయ, యూదయ, సమరయ, యెరూషలేము.
స్వీకర్త
యోహాను సువార్తను అతడు యూదులకు రాశాడు. యేసే మెస్సియ అని రుజువు చెయ్యడం యోహాను ఉద్దేశం. వారు “యేసే క్రీస్తు అని, ఆయనలో నమ్మకం ఉంచడం ద్వారా అయన నామాన్ని బట్టి జీవం పొందాలని” రచయిత ఉద్దేశం.
ప్రయోజనం
20:31 లో చెప్పినట్టు ఈ సువార్త ఉద్దేశం క్రైస్తవులను విశ్వాసంలో స్థిరపరచి నిర్ధారించడం. “యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి అయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.” యేసే దేవుడు అని యోహాను స్పష్టంగా ప్రకటించాడు (1:1). అన్నిటినీ అయన ఉనికిలోకి తెచ్చాడు (1:3). ఆయనే వెలుగు (1:4, 8, 12), జీవం (1:4; 5:26; 14:6). యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని రుజువు చేయడానికి యోహాను తన సువార్త రాశాడు.
ముఖ్యాంశం
యేసు దేవుని కుమారుడు.
విభాగాలు
1. యేసు జీవనాథుడు — 1:1-18
2. మొదటి శిష్యులకు పిలుపు — 1:19-51
3. యేసు బహిరంగ పరిచర్య — 2:1-16:33
4. ప్రధాన యాజకుని ప్రార్థన — 17:1-26
5. యేసు సిలువ, పునరుత్థానం — 18:1-20:10
6. యేసు పునరుత్థానానంతర పరిచర్య — 20:11-21:25